పర్యావరణ పరిరక్షణకు చిన్నారుల వినూత్న సందేశం
వేప చెట్లను ‘తల్లి వృక్షాలు’గా ప్రకటించిన విద్యార్థులు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పిలుపుకు స్పందన
*చెట్ల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చిన్నారుల పిలుపు*

చేవెళ్ల : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ పిలుపు మేరకు చేవెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థులు, చిన్నారి పుడమి నాయకురాళ్లు బిందు మరియు లక్ష్మీ తేజ వేప చెట్లను “తల్లి వృక్షాలు”గా ప్రకటించి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును చాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ మార్పులు, కాలుష్య సమస్యల నుంచి భూమిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కేవలం కొత్త మొక్కలను నాటడమే కాకుండా ఇప్పటికే ఉన్న పెద్ద పెద్ద చెట్లను కూడా తల్లి వృక్షాలుగా గుర్తించి వాటి రక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.వేప చెట్టు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, అలాంటి చెట్లను కాపాడటం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైనవాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు.చిన్నారుల ఈ వినూత్న కార్యక్రమాన్ని స్థానికులు, ఉపాధ్యాయులు అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండటం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
