
- సుప్రీంకోర్టు తీర్పు మత స్వేచ్ఛకు వ్యతిరేకం
- ఈ తీర్పుతో దళిత క్రైస్తవులకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్ట రక్షణ దెబ్బతినే ప్రమాదం
- తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

ధర్మఘంట, మార్చి 25, హైదరాబాద్ : దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14, 15) మరియు మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25) యొక్క అసలు ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పౌరుడికి తన ఇష్టానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, మత మార్పిడి చేసిన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, చారిత్రక వెనుకబాటుతనాన్ని ఈ తీర్పు పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. కేవలం మతం మారిందని చెప్పి, కుల ఆధారిత వివక్ష పూర్తిగా తొలగిపోయిందని భావించడం వాస్తవానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
కుల వివక్ష అనేది శతాబ్దాలుగా ఏర్పడిన సామాజిక నిర్మాణం. అది మత మార్పిడి ద్వారా ఒక్కరోజులో తొలగిపోదని, దళితులు క్రైస్తవం, ఇస్లాం లేదా బౌద్ధ మతాలను అనుసరించినప్పటికీ, వారు ఇంకా సామాజికంగా వివక్షను ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. గతంలో జరిగిన కారంచేడు, చుండూరు వంటి దారుణ ఘటనలు దళితులపై ఉన్న వివక్ష ఎంత లోతుగా ఉందో తెలియజేస్తాయని గుర్తు చేశారు.
ఈ తీర్పు వల్ల మత మార్పిడి చేసిన దళితులకు చట్టపరమైన రక్షణలు క్రమంగా తగ్గిపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సి/ఎస్టి అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం అనే రాజ్యాంగ ప్రాథమిక విలువలను బలహీనపరచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దళిత క్రైస్తవులకు న్యాయం అందించాలంటే, వారి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మత మార్పిడి కారణంగా వారి హక్కులు కోల్పోయే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి ఈ తీర్పును పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాకుండా, దళిత క్రైస్తవుల హక్కులను రక్షించే విధంగా చట్టపరమైన మరియు విధానపరమైన మార్పులు తీసుకురావాలని కోరారు.
దళిత క్రైస్తవుల సామాజిక భద్రత, గౌరవం, న్యాయం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, సమానత్వం మరియు మత స్వేచ్ఛ అనే రాజ్యాంగ మూల సూత్రాలను నిలబెట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
