ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో తమిళ హీరో మాధవన్ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ తరుణంలో జనాలు అజిత్ దోవల్ గురించి తెలుసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి అజిత్ దోవల్ గురించి తెలిసే ఉంటుంది. నిజ జీవితంలో అజిత్ దోవల్, హమ్జా అలీ మజారీ (అకా జస్కిరత్ సింగ్ రంగి) కంటే ఎన్నో డేంజర్ మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ 81 ఏళ్ల వయసులోనూ దేశం కోసం సేవలు అందిస్తున్నారు. అజిత్ దోవల్ నిజ జీవితంలో నిర్వహించిన ఒక డేంజర్ మిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారునిగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు. 1989లో కీర్తి చక్ర శౌర్య పురస్కారాన్ని అందుకున్న ఆయన, రెండవ అత్యున్నత శాంతికాల సైనిక గౌరవాన్ని అందుకున్న మొదటి పోలీసు అధికారి అయ్యారు. 2009లో, ఆయన న్యూఢిల్లీలో ఉన్న వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతేకాదు, జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యే వరకు దాని డైరెక్టర్గా కూడా పనిచేశారు.
డోవల్ 1945లో ఘర్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుత ఉత్తరాఖండ్) కు చెందిన ఘర్వాల్ప ప్రాంతంలోని గిరి బనేల్సున్ గ్రామంలో జన్మించారు. డోవాల్ తండ్రి సైన్యంలో పనిచేశారు.
అజిత్ కుమార్ దోవల్… 1968 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి. సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. 23 ఏళ్లకే ఐపీఎస్కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు
దోబాల్ 1968లో కేరళ క్యాడర్ లో ఐపీఎస్ లో చేరారు. పంజాబ్, మిజోరంలలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలుపంచుకున్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత ఐసీ-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో దోభాల్ ఒకరు. ప్రత్యేకించి 1971-1999 మధ్య జరిగిన 15 భారత విమానాల అపహరణల నుంచి ప్రయాణికుల్ని విడిపించే వివిధ చర్యలు అన్నిటిలోనూ పాల్గొని అనుభవం గడించడం విశేషం. ఇంటిలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ది కాలం నడిపించడమే కాక మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎం.ఎ.సి.), సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ (జేటిఎఫ్ఐ) లకు సంస్థాపక ఛైర్మన్ గా పనిచేశారు. సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు దోవల్. అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారీయన. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎం.ఎన్.ఎఫ్.) తిరుగుబాటు సమయంలో లాల్డెంగా నాయకులు ఏడుగురులో ఆరుగురిని తనవైపు డోవల్ తిప్పుకోగలిగారు.
1980ల్లో మిజో నేషనల్ ఆర్మీ (ఎమ్ఎన్ఏ)లో ఒకరిగా చేరి మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్ఎన్ఏ అధినేత బైక్చ్చుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు. ఒక దశలో ‘దోవల్ మాటల్ని వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంద’ని వారి నాయకుడు లాల్డెంగా ఆ అధినేతను హెచ్చరించాడట. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘దోవల్వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. నా కింద ఏడుగురు మిలటరీ కమాండర్స్ ఉండేవారు. వారిలో ఆరుగురిని దోవల్ నా నుంచి దూరం చేశారు’ అని లాల్డెంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్ఎన్ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్. చాలామంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని దోవల్ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. ‘ఇండియన్ పోలీస్ మెడల్’ను అందుకున్న పిన్న వయస్కుడు దోవల్.
ఆపరేషన్ బ్లాక్ థండర్ గా పిలిచే … ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజులు ముందు స్వర్ణదేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతాదళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణదేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్ పూర్తిచేయగలిగింది. ‘తీక్షణమైన పరిశీలనా శక్తి, అంతుచిక్కని నవ్వు…’ దోవల్ ప్రత్యేకతలని చెబుతారు ఆ ఆపరేషన్లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. ఆ ఆపరేషన్కుగానూ దోవల్ ‘కీర్తి చక్ర’ అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసేవారికే అప్పటివరకూ ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి.
90ల్లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్ కశ్మీర్లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయ్. ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్ము, కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో దిల్లీ వర్గాలు దోవల్ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. కొన్నిసార్లు ఆయన్ని విమర్శించినవారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. అంతవరకూ గూఢచారిగా పేరుతెచ్చుకున్న దోవల్… వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు. ఈశాన్య భారత్, పంజాబ్, కశ్మీర్… భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాసరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభాపాటవాల్ని ఉపయోగించేవారు దోవల్. అంతేకాదు, ఏడేళ్లపాటు పాకిస్తాన్లో గూఢచారిగానూ ఉన్నారు. లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తోపాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంట్లను నియమించారు. ఓసారి లాహోర్లో బయటకు వెళ్లినపుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్ను చూసి ‘నువ్వు హిందూ కదా!’ అని అడిగాడట. కాదని దోవల్ సమాధానమిచ్చినా తనతో రమ్మని రెండు మూడు సందులు తిప్పి తన గదికి తీసుకొని వెళ్లాడట ఆ వ్యక్తి. ‘నువ్వు కచ్చితంగా హిందూవే’ అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్ ప్రశ్నిస్తే, ‘నీ చెవికి కుట్టు ఉంది. ఈ సంప్రదాయం హిందువులదే. అలా బయట తిరగకు. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు, నేను కూడా హిందువునే’ అని చెప్పి, తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలు చూపించాడట. తన కుటుంబాన్ని అక్కడివారు పొట్టన పెట్టుకున్నారనీ, తాను వేషం మార్చి బతుకుతున్నాననీ దోవల్తో చెప్పాడట అతడు. తర్వాత కొన్నాళ్లు లండన్లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్కు వెన్నతో పెట్టిన విద్య.
1999లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన కాఠ్మాండూ-దిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించిన సమయంలో బందీలను విడిపించడంకోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్ ఒకరు. అంతకు ముందు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాల హైజాకింగ్ సంఘటనల సమయంలోనూ దోవల్ చర్చలకు వెళ్లారు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్నీ, నిఘా వర్గాల్నీ సమన్వయం చేసేందుకు ‘మల్టీ ఏజెన్సీ సెంటర్’ను ఏర్పాటుచేసి దాని సారథ్య బాధ్యతలు దోవల్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం ‘జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్’కూ సారథ్యం వహించేవారాయన. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడతలో హోం మంత్రి ఎల్.కె.అడ్వాణీకి సన్నిహితంగా ఉండేవారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్ని ‘ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్’గా నియమించింది యూపీఏ. కానీ ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలే ఉన్నారు. 2005లో అధికారికంగా రిటైరైనా, ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత దావూద్ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్కు ఆయన స్కెచ్ గీశారు. దావూద్ కూతురు పెళ్లికి దుబాయ్లోని హోటల్కు వచ్చినపుడు చంపాలన్నది ప్రణాళిక. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఛోటా రాజన్ ముఠాకు చెందిన ఇద్దర్ని అందుకు సిద్ధం చేశారు దోవల్. ఆ దశలో ముంబయి పోలీసు వర్గాల్లో దావూద్కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు. దిల్లీలో ఛోటా రాజన్ అనుచరులతో దోవల్ మంతనాలు జరుపుతున్న హోటల్కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరినీ అరెస్టు చేసి దోవల్ మాట చెల్లనివ్వకుండా చేశారు
భారతదేశం తన తొలి అణు పరీక్షను 1974లో మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. దీన్నే ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్నేమ్తో పిలుస్తారు. రెండవ సారి 13 మే 1998లలో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ అణు పరీక్షల తర్వాత పాకిస్థాన్ అణ్వస్త్ర సాధనలో దూకుడుగా వ్యవహరించింది. చైనా వంటి దేశాల మద్దతుతో ఎలాగైనా అణ్వాయుధాలను సంపాదించాలనే పట్టుదలతో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఇక్కడే భారత్ కీలక అడుగు వేసింది. పాకిస్థాన్ అణు రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకుంది. అప్పుడే అసలైన ధురంధర్ అజిత్ దోవల్ పేరు వెలుగులోకి వచ్చింది. పాక్ అణు రహస్యాన్ని బయటపెట్టే బాధ్యతను సూపర్ కాప్గా గుర్తింపు పొందిన అజిత్ దోవల్కు నాటి భారత ప్రభుత్వం అప్పగించింది. దీంతో తన కుటుంబాన్ని వదిలేసి పాకిస్థాన్ రహస్యాలను తెలుసుకునేందుకు బయలుదేరారు అజిత్. ఇస్లామాబాద్ సమీపంలోని ఖహూటా బయటకు మాత్రం ఓ సాధారణ పట్టణం. కానీ, అక్కడి ఖాన్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్ (KRL)లోనే పాక్ అణు పరిశోధనలు సాగించింది. దేశాల విధిని మార్చగలిగే రహస్యాలను కాపాడుకోడానికి అక్కడ శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కఠినమైన నిబంధనలు అనుసరించేవారు. ఒక చిన్న పొరపాటు జరిగితేనే రహస్యాలన్నీ బయటపడే ప్రమాదం ఉంది. అయితే, ఆ వాతావరణంలో కలిసిపోయిన దోవల్.. ఇందుకోసం అజిత్ దోవల్ ఇస్లాం మతంలోకి మారారు. ఆ సమాజంలో పూర్తిగా కలిసిపోయారు. ఉర్దూను ఎంత అనర్గళంగా మాట్లాడేవారంటే, ఆ విషయం ఎవరికీ అనుమానం రాలేదు. ఒకసారి లాహోర్లోని ఒక మసీదు బయట ఒక వృద్ధుడు ఆయనను గుర్తుపట్టాడు. ఆ వృద్ధుడు అజిత్ దోవల్తో, “అబ్బాయి, నీ చెవులు కుట్టించుకున్నావు; నువ్వు హిందువువి” అన్నాడు. దానికి దోవల్ చాకచక్యంగా తాను చిన్నప్పుడు చెవులు కుట్టించుకుని, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారానని బదులిచ్చాడు. దీంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. మాసిన గెడ్డం, చినిగిన దుప్పటితో బిచ్చగాడి వేషంలో 1980వ దశకంలో ఒకటి రెండు కాదు దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్థాన్ వీధుల్లో తిరిగారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్న అజిత్ దోవల్.. బిచ్చగాడి వేషంలో తలదాచుకున్నారు. ఒంటిపై చిరిగిన దుప్పటి, నెరసిన జుట్టు, మాసిన గెడ్డంతో చూసేవారికి దయ, జాలికోసం చేతులు చాచే అభాగ్యుడిలా కనిపించేవారు. కానీ ఆ వేషం వెనుక ఒక ముఖ్యమైన గూఢచారి, అత్యంత చురుకైన మేధావి దాగి ఉన్నారు. ఈ ఆపరేషన్లో దోవల్కు నిజమైన బ్రేక్థ్రూ ఒక చిన్న సెలూన్ దుకాణంలో దొరికింది. ఆ సెలూన్కు కేఆర్ఎల్ శాస్త్రవేత్తలు తరచూ వచ్చి క్షవరం చేయించుకునేవారు. వారి జుట్టును ఎవరికీ తెలియకుండా దోవల్ జాగ్రత్తగా సేకరించి నమూనాలను భారత్కు పంపారు. దీనిని ల్యాబ్లో పరీక్షించగా యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పాకిస్థాన్ అణ్వస్త్ర తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్టు భారత్కు స్పష్టమైంది. ఈ గూఢచర్య సమాచారంతో భారత తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. దోవల్ వల్ల పాకిస్థాన్ అణు సామర్థ్య పరీక్షలు దాదాపు 15 ఏళ్లు ఆలస్యమయ్యాయి. ఇలా దేశం కోసం ఆరేళ్లు పాకిస్థాన్లో గడిపిన అజిత్ దోవల్ అసలైన ధురంధర్. అందుకే ఆయనను భారత ‘జేమ్స్ బాండ్’ అని కూడా పిలుస్తుంటారు.
ఐబీ డైరెక్టర్గా రిటైరయ్యాక ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. భద్రత, దౌత్య, సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేథోపరమైన చర్చలు జరుగుతుంటాయి. అవి ప్రభుత్వ విధానాలకూ పనికొచ్చేవి
మోదీ ప్రధాని అయ్యాక దోవల్ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా నియమించారు. . వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్ఎస్ఏ అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది. అప్పుడే దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతారు. రా, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్ వ్యూహ రచన చేశారంటారు. గతేడాది మణిపూర్లో మన సైన్యానికి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మయన్మార్లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. గత అక్టోబరులో మయన్మార్ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు. బంగ్లాదేశ్లో తలదాచుకుంటున్న ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్ ఛేతియాని గత నవంబరులో ఆ దేశం మనకు అప్పగించింది. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవడం సహా చాలా అంశాల్లో సానుకూలంగా స్పందించిన బంగ్లాదేశ్ మనకు సన్నిహితమైన పొరుగుదేశమంటూ బహిరంగంగానే ప్రకటించారు దోవల్. ఐబీ మాజీ డైరెక్టర్ సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీమ్ను 2015లో తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో చర్చించేందుకు నియమించారు. ఇదివరకు ఇలాంటి రాయబారి హోదా లేదు. అదే సమయంలో పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్ మార్పులు తెచ్చారనీ, అందువల్లే ఛోటా రాజన్ను పట్టుకోగలిగారనీ చెబుతారు.
ఊరీ తీవ్రవాద దుశ్చర్య తరువాత, మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి.. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ ధోవల్ ప్రధానపాత్ర పోషించారు..
