మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్బేస్పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతం కావడం, కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య అంగీకారం కుదిరిన క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) గుజరాత్లోని భుజ్ ఎయిర్బేస్ (Bhuj Airbase)ను సందర్శించనున్నారు. ఈనెల 16న ఆయన భుజ్కు వెళ్తారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా పర్యటిస్తారు. పాకిస్తాన్ ఇటీవల డ్రోన్ దాడులకు విఫలయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో భారత సాయుధ బలగాల సన్నద్ధతను, భద్రతా పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను రక్షణ మంత్రి సమీక్షించనున్నారు.
ఆదంపూర్లో పర్యటించిన మోదీ
దీనికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను మంగళవారంనాడు సందర్శించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న జవాన్లను కలుసుకున్నారు. జవాన్ల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.